Transfers - టీచర్ల బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవు ♦️ప్రాథమికంగా అభిప్రాయపడిన హైకోర్టు ♦️తుది జాబితా ప్రకటించవద్దని స్పష్టీకరణ

 📚✍️టీచర్ల బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవు

♦️ప్రాథమికంగా అభిప్రాయపడిన హైకోర్టు

♦️తుది జాబితా ప్రకటించవద్దని స్పష్టీకరణ

🌻ఈనాడు, అమరావతి: 

ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ ఈనెల 10న జారీచేసిన జీవో 187లోని మార్గదర్శకాలు సక్రమంగా లేవని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. యాంత్రికంగా మార్గదర్శకాలిచ్చినట్లుందని తెలిపింది. అనాలోచితంగా జీవో ఇచ్చారని ఆక్షేపించింది. గత బదిలీలలో ‘ప్రాధాన్యత కేటగిరి’ కింద ప్రయోజనం పొంది ఉంటే ఇప్పుడు ఆ ప్రయోజనం వర్తించదని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపట్టింది. 2020లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే అదనపు పాయింట్లు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల మ్యాపింగ్‌ నిర్ణయం కారణంగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడినందున అందరికి ప్రత్యేక పాయింట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. అవకాశం ఇచ్చినప్పటికీ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలకు అధికారులు పరిష్కారం చూపలేనందున వ్యాజ్యంపై లోతుగా విచారణ చేసి తగిన ఆదేశాలిస్తామని తేల్చిచెప్పింది. ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులకు స్వేచ్ఛనిచ్చింది. తుది జాబితా ప్రకటించవద్దని పేర్కొంది. సమగ్రంగా కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

▪️ఇటీవల వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రాథమిక సీనియార్టీ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలు దాఖలు చేసేవరకు మాత్రమే ప్రక్రియ జరపాలని అధికారులకు తేల్చిచెప్పారు. తదనంతరం ముందుకెళ్లాలంటే కోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూడాలన్న విషయం తెలిసిందే.

No comments

Powered by Blogger.